హైదరాబాద్ : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్ గూడలోని వెంకటగిరి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని కంటెయిన్ మెంట్ జోన్ గా పోలీసులు ప్రకటించారు. కాగా బుధవారం స్థానిక కార్పొరేటర్ సంజయ్ గౌడ్ వెంకట గిరిలోని తన నివాసం వద్ద నిత్యావసర వస్తువులు, గుడ్లు పంపిణీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా పంపిణీ చేయడంతో పాటు జనం భౌతిక దూరం పాటించడంలో విఫలమవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.